పోకిరిని మించి చేద్దాం: మహేశ్‌ బాబు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌ బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా కలెక్షన్న సునామీ సృష్టిస్తోంది. చిత్రం విడుదలైన ఈ మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా పండగ సమయం ఉన్నందున మరిన్ని భారీ వసూళ్లు చేసే అవకాశం ఉంది. దీంతో మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ను చిత్ర యూనిట్‌ తెగ ఎంజాయ్‌ చేస్తోంది.   




ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్‌ రోజుకొక ప్రొమో, ప్రమోషన్‌ వీడియోలతో హల్‌చల్‌ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మహేశ్‌కు చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి మహేశ్‌ కూల్‌గా సమాధానమిచ్చాడు. దీనిలో భాగంగా చిత్ర విశేషాలను, విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు. తదుపరి చిత్రంలో పోకిరి మహేశ్‌ అటిట్యూడ్‌ అండ్‌ ఇంటెన్స్‌ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్‌లో గొప్ప చిత్రాలను చేద్దామని, పోకిరిని మించి చేద్దామని తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌లో శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ బాగా చేశారని, ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్‌గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్‌ సూచించాడు. తప్పకుండా తన చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్‌ మాస్టర్‌తో కలిసి పనిచేస్తామని మహేశ్‌ మాటిచ్చాడు. పూర్తి విశేషాల కోసం కింది వీడియోను చూడండి.